కరోనా వైరస్తో చిగురుటాకులా వణికిపోయిన రెండు దేశాలు ఇటలీ, స్పెయిన్ ఇప్పుడిప్పుడే కొంతమేరకు కోలుకుంటున్నాయి. ఈ రెండు దేశాల్లో వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. స్పెయిన్లో వరుసగా నాలుగు రోజు సోమవారం కూడా తగ్గిందని కరోనా వల్ల కొత్తగా మృతిచెందిన వారి సంఖ్య 637గా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 24వ తేదీ నుంచి నమోదైన మరణాల సంఖ్యలో ఇది అత్యల్ప సంఖ్య కావడం గమనార్హం. గత గురువారం స్పెయిన్లో అత్యధికంగా 950 మంది ఒకే రోజు మరణించారు. ఇక కొత్తగా ఆ దేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 4273గా ఉన్నది. ఇప్పటి వరకు వైరస్ వల్ల మొత్తం 13,055 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
అయితే.. చైనాలోని వుహాన్నగరంలో పుట్టిన కరోనా వైరస్ చూస్తుండగానే.. అన్నిదేశాలను చుట్టేసింది. ప్రధానంగా యూరప్ దేశాలను కుదిపేసింది. అందులోనూ స్పెయిన్, ఇటలీలో బీభత్సం సృష్టించింది. ఇటలీలో ఇప్పటి వరకు 15,887 మంది మరణించారు. వైరస్ సంక్రమణ, మరణాల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్నది. ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే.. ఈరెండు దేశాల్లో లాక్డౌన్ ను చాలా కఠినంగా అమలుచేయడం, ప్రజల్లోనూ తగిన అవగాహన రావడంతోనే కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసులు పూర్తి స్థాయిలో తగ్గేదాకా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. మాస్క్లు ధరించి బయటకు రావాలని సూచిస్తున్నాయి.