దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నాయి. కష్టకాలంలో ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలుగుకుండా కనీస అవసరాలు తీర్చేందుకు చేయూతనిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో కరోనా కట్టడికి ఆర్డిటీ సంస్థ 3 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్డిటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ స్పందించారు. ఇందులో ఒక కోటి రూపాయలను జిల్లా కలెక్టర్ అకౌంట్ కు ఇవ్వగా మరో కోటి రూపాయలను జిల్లాలోని క్వారైంటైన్ కేంద్రాల్లో ప్రభుత్వం సమకూర్చే సామాగ్రికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మార్చి నెల 27 తేదీన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆర్డిటీ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్న సామగ్రికి మరో కోటి రూపాయలు చెల్లిస్తున్నామని హామీ ఇచ్చారు.
అంతే కాకుండా ఆర్డిటీ సంస్థ నడుపుతున్న బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనేకల్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు సంస్థ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అన్నే ఫెర్రర్ చెప్పారు. ఇంకా ప్రభుత్వానికి ఆర్డిటీ సంస్థ తరుఫున ఏమైనా సహాయ సహాకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్డిటీ సంస్థ ఇదివరకే ప్రతిరోజూ 3000 మందికి ఆహారాన్ని అందిస్తోందన తెలిపారు. అంతేగాకుండా.. సంస్థకు సంబంధించిన ఆసుపత్రులు కూడా ప్రభుత్వానికి సహకరించడం గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు, ఇపుడు కరోనా నివారణ నిమిత్తం 3 కోట్ల రూపాయలు అందజేయడం, ఆర్డిటీ సంస్థ చేస్తున్న సేవలు మరువలేనివి కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఇంతటి కష్టకాలంలో ఆర్డిటీ సంస్థ చూపిస్తున్న సేవా గుణానికి అనంతపురం జిల్లా ప్రజలు జేజేలు పలుకుతున్నారు.