తెలంగాణ సీఎం కేసీఆర్.. నోరు తెరిస్తే ప్రత్యర్థికి వణుకుపుట్టాల్సిందే. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టి మాట్లాడుతారు. ఇక విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారంటే.. ఆరోజు ఏదో పత్రికపై, విలేకరిపై తనదైన శైలిలో విరుచుకుపడుతారు. పొరపాటున ఎవరైనా అడిగిన ప్రశ్నలో లాజిక్ మిస్ అయ్యిందంటే.. ఇక అంతేసంగతులు.. కేసీఆర్ విసిరే పంచ్లు మామూలుగా ఉండవు. తాజాగా, ప్రగతిభవన్లో సోమవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కూడా ఇదే జరిగింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన ఓ పత్రికపై విరుచుకుపడ్డారు. తప్పుడు కథనం రాశారంటూ మండిపడ్డారు. ఆపదకాలంలో ప్రజలకు, వైద్యసిబ్బందికి అండగా ఉండకుండా.. తప్పుడు రాతలు రాస్తున్నారని, ఇలాంటి చిల్లరగాళ్లపై తగిన చర్యలు తప్పకుండా ఉంటాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
* మనం కష్టకాలంలో ఉన్నాం. ఆపదలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ఒకరికొకరం అండగా ఉండాలి. చేయూత అందించుకోవాలె. ప్రాణాలకు తెగించి, కరోనా బాధితులకు, ఈ సమాజానికి సేవలు అందిస్తున్న వారికి మనందరం అండగా ఉండాలి. వారిలో ధైర్యం పెంచాలి. కానీ.. కొందరు చిల్లరగాళ్లు మకిలిరాతలు రాస్తుండ్రు. ఆపదకాలంలో ప్రజలు, వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చిల్లరరాతలు రాసిండ్రు. వాళ్లకు కచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. వాళ్లకు కరోనా సోకాలె. నేను శపిస్తున్నా* అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పత్రికలో వచ్చిన వైద్యులకు రక్షణ ఏదీ అనే కథనంపై సీఎం కేసీఆర్ స్పందించారు. పత్రిక పేరు చెప్పకుండానే ఉతికి ఆరేశారు. ఏడాపెడా వాయించారు. చిల్లరరాతలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.