కరోనా కట్టడికి లాక్ డౌన్ మాత్రమే శరణ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే , దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది . లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా ను కట్టడి చేయడం అంతాఆషామాషి వ్యవహారం కాదని కేసీఆర్ పేర్కొన్నారు . ఆర్ధికంగా నష్టపోయినా పుంజుకోవచ్చు కానీ ప్రాణనష్టమన్నది జరిగితే దాన్ని పూడ్చడమన్నది ఎవరి వల్ల సాధ్యం కాదని ఆయన అన్నారు .
అయితే కేసీఆర్ ఎంతగా చెబుతున్నా, ఏప్రిల్ 14 వతేదీ తరువాత యధావిధిగా లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలు ఎంతమాత్రం లేవని తెలుస్తోంది . ఇప్పటికే లాక్ డౌన్ వల్ల రోజువారీ కూలీలు , ఉపాధి కార్మికులు , వేతన జీవులు తీవ్ర ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ... ఒకవైపు కరోనా కట్టడికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే , మరొకవైపు దశలవారీగా లాక్ డౌన్ సడలింపు ప్రక్రియ వైపే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది . ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ , మంత్రి వర్గ సహచరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు . లాక్ డౌన్ సడలించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన వారికి సూచించారు .
కరోనా హాట్ స్పాట్ లు మినహాయించి , మిగతా ప్రాంతాల్లో దశల వారీగా లాక్ డౌన్ సడలించే విధంగా ప్రణాళిక ఉండాలని మంత్రివర్గ సహచరులకు మార్గనిర్దేశం చేశారు . కరోనా హాట్ స్పాట్ కేంద్రాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో అన్ని శాఖలు నెమ్మదిగా తమ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలని మోదీ తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించారు .