దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరోకీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందో గుర్తించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 96 జిల్లాలను కరోనా రెడ్ జోన్లుగా ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను రెడ్ జోన్లో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచే మొత్తం పది జిల్లాలు ఉండడంతో ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. రెడ్ జోన్ పరిధిలో ఉన్న జిల్లాల్లో హాట్ స్పాట్లను గుర్తించి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రెడ్ జోజోన్ జిల్లాలో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపాదికన రెడీ చేయాలంటూ ఆదేశించింది.
అంతేగాకుండా... ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితికి అనుగుణంగా మొత్తం ప్రాంతాలను సెల్ఫ్ క్వారంటైన్ గా మార్చాలని, ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేసేందుకు ముందుకు కదులుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.