సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ చాలా యాక్టివ్గా ఉంటారు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా పోస్ట్ చేస్తే చాలా వెంటనే స్పందించి, వారికి సాయం అందించడంలో ఎప్పుడూ కేటీఆర్ ముందే ఉంటారు. ఇంత బీజీలోనూ ఆయన స్పందించే తీరుతో బాధితులకు భరోసా కలుగుతోంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు, ఆపదలోఉన్నవారిని ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు సమచారాన్ని కట్టడి చేసేందుకు, ప్రజలకు అసలు నిజాలను తెలిపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. ఆయన మరో అడుగు ముందుకు వెశారు. *కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా వివిధ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనాపై ప్రజలకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించిందని’ మంత్రి కేటీఆర్ అన్నారు.
లాక్డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు కరోనాపై సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాట్సాప్ ‘చాట్ బాట్’ను కేటీఆర్ ఆవిష్కరించారు. 9000658658 నంబరుపై ‘‘TS Gov Covid Info’’ పేరిట రూపొందించిన ఈ వా ట్సాప్ చాట్ బాట్ ద్వారా కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన ఎస్.బి.టెక్నాలజీస్, మెసెంజర్ పీపుల్ సంస్థతో కలిసి రాష్ట్ర ఐటీ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ చాట్ బాట్ను రూపొందించాయి. అయితే.. చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి 9000658658 నంబరుకు ‘HI’లేదా ‘Hello’లేదా ‘Covid’అని వాట్సాప్లో సందేశం పంపించాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింకును మొబైల్ నుండి క్లిక్ చేయాలి. సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈ మెయిల్ చేయవచ్చు.