ఓవైపు కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నా.. పలు ప్రాంతాల్లో మాత్రం ప్రజల నుంచి పెద్దగా సహకారం అందడం లేదు. ప్రభుత్వ సూచనలను లైట్గా తీసుకుంటున్నారు. కరోనా తమనేమీ చేయలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసరాలు, నిత్యావసరాల కోసం తప్ప మిగతా సమయాల్లో అడుగుబయటపెట్టొద్దని సూచిస్తున్నా.. తేలికగా తీసుకుంటున్నారు. స్వీయనియంత్రణను గాలికొదిలేస్తున్నారు. ఇక సామాజిక దూరాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా కూడా పలువురు హాయిగా రోడ్లపైకి వస్తున్నారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అటూ ఇటూ తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వీరిపట్ల మరింత కఠినంగా ఉండాలని పలువురు అధికారలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాలోని ఓ కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలను అప్రమత్తం చేసే చర్యల్లో భాగంగా ఒడిశా లోని గంజాం జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినా ఉపయోగ లేకపోవడంతో అక్కడి కలెక్టర్ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అది ఎంతో తెలుసా.. గ్రామీణ ప్రాంతాలవారికి ఐదు వందల రూపాయలు, నగరాల్లో ఉండేవారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. కలెక్టర్ నిర్ణయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చాలా వరకు కలెక్టర్కు మద్దతు లభిస్తోంది. మనల్ని మనం కాపాడుకునేందుకు కచ్చితంగా మాస్క్లు ధరించడమేకాదు.. సామాజిక దూరం కూడా పాటించాలని పలువురు సూచిస్తున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.