భారత్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. అందులోనూ మూడు రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రతీరోజు మహారాష్ట్ర నుంచే పాజిటివ్ కేసుల నమోదుతోపాటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు 868 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45మంది మరణించారు. ఇక తమిళనాడులో ఇప్పటివరకు 621మంది కరోనా బారినపడగా.. ఆరుగురు మరణించారు. ఆ తర్వాత ఢిల్లీలో కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. 525 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల నుంచే పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ముంబైలోని వోక్హార్ట్ ఆస్పత్రిలో ఏకంగా 26మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు కరోనా బారినపడడం గమనార్హం.
అయితే.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 132మంది మరణించగా.. మహారాష్ట్ర నుంచే 45 మంది ఉండడం గమనార్హం. ఇక దేశంలో ఇప్పటివరకు 4757 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 132మంది మృతి చెందారు. ఇక కేవలం 24గంటల వ్యవధిలోనే 400 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 70వేల మంది కరోనా బారిన పడి మరణించగా 13లక్షల మందికిపైగా బాధితులు ఉన్నారు. మున్ముందు ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 14 తర్వాత కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ కట్టడికి లాక్డౌన్ను కొనసాగించడం ఒక్కటే ఏకైక మార్గమని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.