దేశంలో వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వారంలో నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విశ్లేషణ ఆధారంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. కరోనా ఎప్పటి నుంచి తగ్గుముఖం పడుతుందన్న విషయంలో మాత్రం కేంద్రప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులను నిరంతరం విశ్లేషిస్తున్న అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం రోజులే అత్యంత కీలకమని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగానైతే.. మే 9వ తేదీ నుంచి కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. నిజానికి.. ఢిల్లీలో ఇటీవల జరిగిన తబ్లిగీ జమాత్ వల్లనే కరోనా కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆ ఘటన జరిగి ఉండకపోతే.. ఇప్పటికే దేశంలో కరోనా అదుపులోనే ఉండేదని అంటున్నారు.
తబ్లిఘి జామాత్ ఉదంతంతోనే కరోనా కేసుల్లో వేగం పెరిగిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతస్థాయి సమావేశాల్లో అధికారులు కూడా చర్చించారు. అయితే, కొవిడ్-19ను నియంత్రించడంలో వచ్చే వారం రోజులు ఎంతో కీలకమైనదని చెబుతున్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులపాటు అంటే ఏప్రిల్ 16నాటికి కరోనా కేసుల నమోదులో స్థిరత్వం ఉంటుందా.. లేక మరింతగా పెరుగుతుందా..? అన్నది తెలియాల్సి ఉందని కేంద్రప్రభుత్వానికి సంబంధించిన ‘డాటా లేబోరేటరీ’ పేర్కొంది. తగినంత వైద్య సామగ్రి, కరోనా కేసుల నమోదును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటే మాత్రం దేశంలో మే 9 వ తేదీ నుంచి కరోనా ముగింపు దశ మొదలవుతుందని అభిప్రాయపడింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి మరి.