తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై పోరు విషయంలో కీలక నిర్ణయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనాను లెక్కచేయకుడా అలుపెరగని సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రజల తరుపున పాదాభివందనం చేసిన కేసీఆర్ వైద్యులు, వైద్య సిబ్బంది వేతనాల్లో 10శాతం నజరానాగా కేసీఆర్ ప్రకటించారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యశాఖ సిబ్బందికి మార్చి నెల వేతనంలో విధించిన కోత మొత్తాన్ని కూడా తిరిగి చెల్లిస్తామని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. మార్చి నెల పూర్తి వేతనం చెల్లిస్తామన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా వైద్యశాఖలో డైరెక్టర్ నుంచి కిందిస్థాయి స్వీపర్ దాకా జీతంలో 10శాతం అదనంగా చెల్లిస్తామని, వెంటనే ఈ మొత్తాన్ని ఇస్తామని చెప్పారు. అయితే, ఈ సందర్భంగానే మరో ప్రతిపాదన తెరమీదకు వస్తోంది.
కరోనాను ఎదుర్కోవడంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సిబ్బందికి పారితోషకం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరోనా సమయంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థల వీధులను, గల్లీలను శుభ్రంగా ఉంచడంతోపాటు రసాయనాలు పిచికారి చేసి మహమ్మారిని దూరంగా ఉంచేందుకు పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పిన సీఎం కేసీఆర్ వారికి పారితోషకం ప్రకటించారు. గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661మంది, మున్సిపాలిటీల్లో 21,531మంది, హైదరాబాద్ వాటర్వర్క్స్ అండ్ సివరేజ్బోర్డులో 2510, జీహెచ్ఎంసీలో 20690 మంది… మొత్తం 95,392మంది పనిచేస్తున్నారని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500 బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలో పనిచేసే వారికి తమ జీతాల్లో ఎటువంటి కోత విధించలేదని, మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సిబ్బందివేతనాల్లో మార్చి జీతంలో కోత పెట్టామని, ఆ మొత్తాన్ని ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్వర్క్స్లో పనిచేసే వారికి రూ.7500, మున్సిపాలిటీలు, పంచాయతీ పారిశుధ్య కార్మికులకు రూ.5వేల ప్రత్యేక ప్రోత్సహాకాన్ని వెంటనే చెల్లిస్తామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇవ్వడం జరిగిందని చెప్పారు.
కాగా, కోవిడ్ 19 రోగులకు వైద్య సాయం అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రోగుల్నుంచి వీరికి వ్యాధి సంక్రమించే అవకాశాలు అధికం. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీరి భవిష్యత్ ప్రభుత్వం ఓ బీమా పథకాన్ని మార్చి 26న ప్రకటించింది. దీని ప్రకారం కోవిడ్ 19 రోగులకు చికిత్స చేసే సమయంలో వ్యాధి సంక్రమణకు గురైన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు 50లక్షలు బీమా సౌకర్యం అమలౌతుంది. అయితే ఈ బీమా పథకాన్ని నిర్వహిస్తున్న న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ నాలుగు రోజుల తర్వాత గతనెల 30న బీమా అమలుకు సంబంధించిన విధివిధానాల్ని వివరించింది. దీని ప్రకారం కోవిడ్ 19కు చికిత్స చేస్తూ అనుకోని సందర్భాల్లో ఈ అంటు వ్యాధి బారిన పడ్డం వల్ల సంభవించే మరణాలకు ఈ బీమా వర్తింపబడుతుందని పేర్కొంది. ఈ బీమా దేశం మొత్తమ్మీద 22.12లక్షల మందికి వర్తిస్తోంది. దీనిక్రింద ప్రజారోగ్య కార్యకర్తలు, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) వర్కర్లతో పాటు ప్రైవేటు ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఇది వర్తిస్తుంది. మార్చి 30నుంచి ఈ బీమా పథకం మొదలైంది. 90రోజుల వరకు ఇది అమల్లో ఉంటుంది. బీమాపై ప్రభుత్వ తొలి ప్రకటనతో ఆరోగ్య కార్యకర్తల్లో ఓ భరోసా ఏర్పడింది. ఈ వ్యాధి సంక్రమిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్తో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా తాము వైద్య చికిత్సలు పొందే అవకాశముంటుందన్న విశ్వాసం కలిగింది. కానీ బీమా పథకాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఇచ్చిన వివరణతో ఇప్పుడు వీరందరిలో భయమేర్పడింది. ఈ వివరణ మేరకు మరణం సంభవించిన సమయాల్లో మాత్రమే వారి కుటుంబాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేతప్ప ప్రమాద వ శాత్తు ఈ వ్యాధి సంక్రమిస్తే చికిత్సకయ్యే వ్యయం ఈ బీమా పరిధిలోకి రాదని తేలిపోయింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని...అవసరమైతే రాష్ట్రం తరఫున లేఖ రాయాలని వారు కోరుతున్నారు.