కరోనాను తరిమికొట్టేందుకు తెలుగు, తమిళ, బాలీవుడ్ సూపర్ స్టార్లంతా ఏకం అయ్యారు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలంతా ఇప్పటికే క రోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు వీడియోలు చేసి అభిమానాలుతో పంచుకుంటున్నారు. తాజాగా మరో ముందడుగు వేసి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ‘ది ఫ్యామిలీ’ పేరుతో రూపొందించిన ఈ లఘు చిత్రానికి ప్రసూన్ పాండే దర్శకత్వం వహించారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సోనీ నెట్వర్క్లో ఈ షార్ట్ ఫిలిం ప్రసారం అయ్యింది.
బాలివుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, దిల్జిత్ దోసంజ్, రణ్బీర్ కపూర్, అలియా భట్, ప్రియాంక చోప్రా నటించారు. కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలన్న ఆవశ్యకతను వివరించారు. అలాగే సినీ ఇండస్ట్రీ కార్మికులు లాక్డౌన్ కాలంలో ఏలాంటి ఇబ్బందులు పడుతున్నారో చిత్రీకరించారు. ఈ సినిమా కథ బిగ్బీ కళ్లజోడు పొగొట్టుకున్న సన్నివేశం నుంచి ప్రారంభం అవుతుంది. వీటిని వెతికి పట్టుకునేందుకు తోటి తారలంతా ప్రయత్నిస్తారు. అయితే ఈ వీడియోలో సెలబ్రిటీలంతా వారి, వారి నివాసాల్లో నటించి, మాతృభాషలో మాట్లాడటం విశేషం.