ఎక్కడో జరిగిన వాటికి మరెక్కడో జరిగే వాటికి తెలియని సంబంధం ఒకటి ఉంటుందని అంటుంటారు కదా! ఇప్పుడు అలాంటి అనూహ్యమైన పరిస్థితి గురించే చర్చ!! అయితే, ఇది రాజకీయాల గురించి! పక్కా రాజకీయాల గురించే!! కష్టకాలంలో రాజకీయ నేతల స్పందన గురించి. ఇందులో ముఖ్యులు అందరూ సీనియర్ రాజకీయవేత్తలే. వాళ్లెవరో కాదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఏంటి జాతీయ రాజకీయాల్లోని ఇద్దరు ముఖ్యనేతలు, శక్తివంతులైన రాజకీయ నాయకులకు, ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలకు మధ్య పోలిక అని అనుకుంటున్నారా? ఉంది. పోలిక ఉంది.
విషయం ఏంటంటే...ప్రధాని మోదీకి లేఖ కాంగ్రెస్ నేత సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనా వైరస్ నివారణ చర్యల గురించి ఆమె పలు సూచనలు, సలహాలు చేశారు. పీఎం కేర్స్కు వచ్చిన నిధులను తక్షణమే పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయాలని ప్రధాని మోదీని సోనియా కోరారు. 20వేల కోట్ల ఖరీదు అయిన సెంట్రల్ విస్టా బ్యూటిఫికేషన్, కన్స్ట్రక్చన్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని సూచించారు. బడ్జెట్లో 30 శాతం కోత విధించాలని, టీవీ, ప్రింట్, ఆన్లైన్లో ప్రభుత్వం ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను నిషేధించాలని సోనియాగాంధీ కోరారు. పీఎస్యూలపై కూడా రెండేళ్ల నిషేధం విధించాలని దాని ద్వారా ఆదా అయ్యే సొమ్మును కోవిడ్19 కోసం ఖర్చు చేయాలన్నారు. ఉన్నత అధికారుల విదేశీ పర్యటనలు అత్యవసరంగా నిలిపివేయాలన్నారు.
ఇలా పలు కీలక సూచనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రతిపక్ష నేత అయిన సోనియాగాంధీ సూచించారు. దీనికి ప్రధాని ఎలా స్పందిస్తారనేది ఆయన చేతుల్లోని విషయం. అయితే, సరిగ్గా ఇదే విషయం కదా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రస్తావించారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి గురించి స్పందిస్తూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీనియర్ల సూచనలు తీసుకోవాలని కోరారు. తాను సలహాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని ఆఫర్ కూడా ఇచ్చేశారు. దానికి ఏపీ సీఎం స్పందించడం లేదనుకోండి. తాజాగా ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితే తెరమీదకు వచ్చినందున..ఇప్పుడు మోదీజీ ఏం చేస్తే..జగన్ సైతం దాన్ని ఫాలో అయిపోవచ్చునన్నమాట.