కరోనా...కరోనా....ఇదే ఇప్పడు ప్రపంచంలో మారుమ్రోగుతున్న పేరు. చైనాలో పుట్టిన ఈ భయంకర వైరస్....ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. ఇక ఈ కరోనా ప్రభావం ఇండియాలో కూడా ఉంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనాకు నయం కావడానికి ఎలాంటి మెడిసిన్ గానీ, వ్యాక్సిన్ గానీ లేదనే సంగతి తెలిసిందే. మనిషిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి బట్టే కరోనాని జయించవచ్చు. 

 

అయితే అన్ని దేశాలు కరోనాకు మెడిసిన్ కనిపెట్టే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాకపోతే దీనికి తమ దగ్గర మెడిసిన్ ఉందని, కరోనాని నయం చేస్తామని చాలాచోట్ల అసత్య ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఇక అది నమ్మిన ప్రజలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. తాజాగా కూడా ఏపీలోని చిత్తూరులో ఈ కరోనాకు నాటు సారా మెడిసిన్ అంటూ కొందరు అసత్యం ప్రచారం చేసారు.

 

ఇక అది నమ్మిన వారు నాటు సారా తెగ తాగేశారు. అయితే నాటు సారాని భారీ రేట్లు చేసి అమ్మి, కొందరు లాభం గడించారు. అసలు సారా రేటు ఎక్కువ చేసుకోవడానికే అలా ప్రచారం చేసి, క్యాష్ చేసుకున్నారు. ఇదే సమయంలో ఇదే చిత్తూరు జిల్లాలో మరో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరులోని ఓ ప్రాంతంలో ఉమ్మెత్తకాయల ద్రావణం తాగితే కరోనా రాదని పుకార్లు రావడంతో జనాలు ఎగబడి మరి తాగేశారు. 

 

ఇక అలా తాగడం వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు, ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని, అసలు కరోనాకు మెడిసిన్ లేదంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే సారా తాగడం వల్ల కరోనా నయం అవ్వడమనేది పచ్చి అబద్దమని, వ్యాపారులు తమ లబ్ది కోసం ప్రజలని మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అయితే కరోనాకు మందు ఉందంటూ, చాలాచోట్ల అసత్యప్రచారం  జరుగుతుంది. కాబట్టి ప్రజలు వాటిని నమ్మకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: