దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ పొడిగించడం మినహా మరో మార్గం లేదని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయగా , ఇప్పుడు ఇదే  వాదనను మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకుంటున్నారు . కరోనా విస్తృతిని కట్టడి చేయాలంటే లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని వారు కూడా కేంద్రాన్ని కోరుతున్నారు . దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్   లు సైతం లాక్ డౌన్ పొడగింపు కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది .

 

ఈ విషయాన్ని ఇప్పటికే వారు కేంద్రానికి నివేదించినట్లు సమాచారం . అయితే ఈశాన్య  రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు . లాక్ డౌన్ ను సడలించాలని వారు కోరుతున్నారు . జనాలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు . అయితే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ సడలించాలని కోరడం అతియోశక్తి ఏమాత్రం కాదని పలువురు పేర్కొంటున్నారు . అయితే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా నమోదు అవుతున్న ప్రస్తుత తరుణం లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి .

 

ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ పొడగించకపోతే   ఇన్నాళ్లు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుందని కేసీఆర్ ఇప్పటికే పేర్కొన్నారు . లాక్ డౌన్ కట్టడి కోసం ఇంత కష్టపడి , కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో సడలించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన స్పష్టం చేశారు . ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడగించాలని , అప్పటి వరకు  కరోనా కట్టడి అవుతుందనే ఆశాభావాన్ని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యక్తం చేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: