కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభం కారణంగా భారత్లో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు మరింత పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. మరోవైపు ఆల్కహాల్ ఉత్తత్తులను అమ్మేందుకు అనుమతించాలని సీఐఏబీసీ తెలంగాణతో సహా పది రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. ఈనేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఉంటుందా.. ఎత్తివేస్తారా.. అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తాజాగా లాక్డౌన్ పొడగింపుపై కేంద్ర మంత్రుల బృందం కేంద్రానికి కీలక సిఫారుసు చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ను మరికొంత కాలం పొడిగించాలని సూచించింది. అంతేగాక మత, విద్యాసంబంధ సంస్థలపై మే 15వరకు ఆంక్షలు కొనసాగించాలని సిఫారసు చేసింది. ఇదిలా ఉంటే మరికొద్ది సేపట్లో ప్ర ధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేత అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.