కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్ధేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 తో లాక్డౌన్ ముగియనుండగా, ఆ తర్వాత లాక్డౌన్ ఉంటుందా.. ఎత్తివేస్తారా.. అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కరోనా వైరస్ కట్టడికి ఇప్పుడు అనుసరిస్తున్న లాక్డౌన్ ను కొనసాగించాలా...? ఎత్తివేయాలా..? లేక ప్రత్యామ్నాయం ఉందా..? అన్న కోణంలో కేంద్రం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రధాని కార్యాలయ వర్గాల ఆదేశాలతో రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్ లకు , కలెక్టర్ లకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయి. దాదాపు అందరూ లాక్డౌన్ను పొడిగించాలని సూచించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే తాజాగా కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించే అవకాశం ఉందని అన్నారు. దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడామని, ఈ రోజు ఎస్పీలతో మాట్లాడిన తర్వాత నివేదికను అందజేస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.