కోవిడ్-19 కర్ణాటకను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ , వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప రేపు మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ ఎత్తివేతకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటి కే రాష్ట్రంలో మొత్తం 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 28 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారిన పడి నలుగురు మరణించారు. అయితే రాష్ట్రంలోనే మొదటి సారి కరోనా కేసు నమోదైన కల్బుర్గిలో దవాఖానలో చికిత్స పొందుతూ కోలుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తి మరణించడంతో ఆందోళన నెలకొంది. దీంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన మిగతా 28 పేషెంట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే ముందు జాగ్రత్తగా అధికారులు కల్బుర్గిలో హైఅలర్ట్ ప్రకటించారు.