ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ఇప్పుడు అన్ని దేశాలూ మలేరియా నివారణ ఔషధం కోసం ప్రాదేయపడుతున్నాయి. భారత్లో ఈ మందు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న విషయ తెలిసిందే. ఈనేపథ్యంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం భారత్ను అభ్యర్థిస్తున్న దేశాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ మందు కోసం బ్రెజిల్ కూడా భారత్ను వేడుకుంది. కరోనా వైరస్ నివారణ పోరాటానికి డ్రాక్సీక్లోరోక్విన్కు తమకు కూడా సరఫరా చేయాలని కోరింది. ‘హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి పవిత్ర ఔషధాన్ని తెచ్చి రాముడి సోదరుడు లక్క్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు కాపాడారు. సంయక్త బలగాలు, ఆశీర్వాదాలతో ప్రజలందరి మేలు కోసం భారత్, బ్రెజిల్ దేశాలు ఈ ప్రపంచ సంక్షోభాన్ని అధిగమించాలి. దయజేసి మా అభ్యర్థనను అంగీకరించండి. మీరు ఇచ్చే భరోసాయే అత్యున్నత గౌరవంగా భావిస్తాను’ అని భారత ప్రధాని నరేంద్రమోడీకి రాసిన లేఖలో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పేర్కొనడం గమనార్హం.
అంతకుముందు అమెరికా కూడా ఈ మందు కోసం వేడుకుంది. ఏకంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీకి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. భారత్ నుంచి స్పందనరాకపోవడంతో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ను తమకు సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. నిజానికి..కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25వ తేదీ నుంచే క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. అయితే పొరుగు దేశం నేపాల్ సహా ప్రపంచ దేశాల నుంచి అభ్యర్థనల నేపథ్యంలో ఎగుమతులుపై నిషేధాన్ని పాక్షికంగా సడలిచింది. మనకు సరిపడా ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేస్తామని భారత్ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాకు కూడా ఈ మందును పంపించేందుకు ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. కరోనాతో విలవిల్లాడుతున్న దేశాలకు మానవతాదృక్పథంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది.