ఇప్పుడు అందరి దృష్టి...లాక్డౌన్ పొడగింపుపైనే. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యం ఓవైపు...కేంద్రం పెట్టిన లాక్ డౌన్ తేదీ ఏప్రిల్ 14 సమీపిస్తుండటం మరోవైపు ఉన్న నేపథ్యంలో... లాక్డౌన్ పోడిగిస్తారా అనే టెన్షన్ సర్వత్రా నెలకొని ఉంది. ఈ విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి, ఉత్కంఠ కలగలిపి పలువురు ఉన్న తరుణంలో...ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలపై పలువురు దృష్టి సారించారు. ఈరోజు నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. కరోనా కట్టడి విషయంలో వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్న మోదీజీ.. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చలు జరిపారు. అయితే, ఇదే సమయంలో కొత్త డిమాండ్ తెరమీదకు వచ్చింది.
లాక్డౌన్ విషయంలో వివిధ పార్టీల నేతలతోచర్చలు జరుపుతున్న తరుణంలో...తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఇదే రీతిలో వ్యవహరించాలని అంటున్నారు. ఇప్పటికే ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఇదే డిమాండ్ చేశారు. తనతో చర్చించాలని, తన సలహాలను తీసుకోవాలని కోరారు. ఇక తెలంగాణలోని ప్రతిపక్షాలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. మొత్తంగా...ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫాలో కావాలన్నది డిమాండ్. దీనిపై సీఎంలు ఏం చేస్తారో వేచి చూడాలి.
ఇదిలాఉండగా, లాక్డౌన్ కొనసాగింపుపై ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా నివారణ చర్యలపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న ప్రధాని ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకొంటున్న చర్యలపై సమీక్షించారు. దీనికి కొనసాగింపుగా ఆయన సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరమే తుది నిర్ణయం వెలువడనుందని అంచనా వేస్తున్నారు.