కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలలో విజృభిస్తుంది. ఇటు జిల్లాల వారీగా కూడా రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే ఒంగోలు జిల్లాలో 24 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. అయితే తాజాగా లండన్ నుంచి వచ్చిన యువకుడు కరోనాను జయించి ఒంగోలు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.
జిల్లాలో 23 మందిలో ఒకరి పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో నెల్లూరు వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా ఒంగోలు కిమ్స్ ఆస్పత్రిని స్వాధీనం జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 10 మంది కరోనా పాజిటివ్ కేసులను ఉంచారు.
అయితే ఒంగోలు జీజీహెచ్లోని క్వారంటైన్ కేంద్రంలో పాజిటివ్ కేసులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు సుమారు 153 మంది అనుమానితులున్నారు. కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి ఒంగోలు జీజీహెచ్లో డాక్టర్ జాన్ రిచర్డ్స్ను నోడల్ ఆఫీసర్గా నియమించారు. వైద్యులు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం కరోనా బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
జిల్లాలో ఉన్న క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లిన అనుమానితుల శాంపిల్స్ను సేకరిస్తున్నారు. ఆ నమూనాలను ప్రతిరోజు ల్యాబ్లకు పంపుతూ రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. పాజిటివ్ కేసులుగా ఉన్న వారిని జీజీహెచ్కు తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే మంగళవారం ఒంగోలు జీజీహెచ్ వైద్యులు 90 మంది కరోనా పాజిటివ్ అనుమానితుల శాంపిల్స్ను ల్యాబ్లకు పంపించారు. అందులో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
జిల్లాలో కరోనా బాధితులు తగ్గుతున్నప్పటికీ పూర్తిగా నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాలో లాక్ డౌన్ అమలు చర్యలను కఠినంగా నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దు చెక్పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి కొత్త వ్యక్తులు జిల్లాలోకి రాకుండా చర్యలు చేపట్టారు.