కరోనా కలకలంతో వ్యాపార పరిశ్రమలు కుదేలు అవుతున్నాయి. కరోనా కారణంగా దేశంలో లాక్డౌన్ ప్రకటించటంతో అన్నిరకాల వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలు మళ్లీ నిలబడాలంటే దేశంలో ఎన్నడూ ఎరుగనంత భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ఫిక్కీ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టాలంటే పరిశ్రమలకు రూ.9నుచి 10లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అవసరమని పేర్కొంది. భారత జీడీపీలో ఇది 4-5శాతం ఉంటుందని అంచనా వేసింది.
కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అన్నిదేశాలూ ఇలాంటి ఉద్దీపనలను ప్రకటిస్తాయని అభిప్రాయపడింది. భారత జీడీపీలో అప్పుల శాతం తక్కువగానే ఉన్నందున ఈ మేరకు ప్యాకేజీ ప్రకటించటం కష్టమేమీ కాదని ఫిక్కీ రూపొందించిన నివేదికలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో కింది నుంచి పై స్థాయి వరకు అన్నిచోట్లా ఉపమశమన, పునరుద్దరణ ప్యాకేజీల ద్వారా నిధులను విరివిగా సమకూర్చవల్సి ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలతోపాటు అసంఘటిత రంగంలోని ప్రజలకు కూడా ఉద్దీపన అందించవలసి ఉంటుంది అని ఫిక్కీ పేర్కొంది.
ఇదిలాఉండగా, కరోనా వ్యాప్తితో కష్టాలలో ఉన్న రాష్ట్రాలకు జీఎస్టీ వాటా కింద కేంద్రం రూ. 14,103 కోట్లను మంగళవారం విడుదల చేసింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలకు గాను మొత్తం రూ. 34,053 కోట్లను రాష్ట్రాలకు చెల్లించినట్లైంది. మొదటి దఫా మొత్తం ఫిబ్రవరి 17 న చెల్లించారు. డిసెంబర్, జనవరి జీఎస్టీ బకాయిలను కూడా దశలవారీగా త్వరలో చెల్లించాలని కేంద్రం చూస్తున్నట్లు అధికార వర్గాలు చెబు తున్నాయి. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కింద రాష్ట్రాలు, యూటీలకు మొత్తం రూ. 1.35 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసింది. జీఎస్టీ అమలులోకి తెచ్చిన మొదటి అయిదేళ్లలో రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేస్తానని కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ జూలై 1,2017 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి చూస్తే రాష్ట్రాలకు మొత్తంగా రూ. 2.45 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం చెల్లించింది. మార్చి 2020 లో జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్కు కిందకి పడిపోయాయి. ఆ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 97,597 కోట్లకే పరిమితమ య్యాయి. అంతకు ముందు ఏడాది మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం తగ్గి పోయాయి. అంతకు ముందు నవంబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 దాకా జీఎస్టీ కలెక్షన్స్ ప్రతీ నెలా రూ. లక్ష కోట్లపైనే ఉన్నాయి.