ఏపీలో కరోనా కట్టడి కోసం ఏపీ సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవంటున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నా.. రోజు విడిచి రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ సర్కారు సరిగ్గా పని చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు.

 

 

స్వీయ నిర్బంధంలో వున్న చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలే కానీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం తగదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సెటైర్‌ పేల్చారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేయడంపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు తెలంగాణలో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజూ సమీక్షలు చేస్తున్నారని తెలిపారు.

 

 

ఏపీ ప్రజలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఉన్నారని.. చంద్రబాబు హాయిగా హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటే మేలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. కరోనా నివారణకు లాక్‌డౌన్, సోషల్‌ డిస్టెన్స్‌ ఒక్కటే మార్గమని... ప్రపంచమంతా కరోనా వైరస్‌ అల్లకల్లోలం సృష్టిస్తోందని.. లాక్‌డౌన్‌ను కొన్ని రోజులు పొడిగించే అవకాశముందని శ్రీకాంత్‌ రెడ్డి అంటున్నారు.

 

 

రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం ఆలోచిస్తున్నారని.. టీడీపీ కరోనా సమయంలోనూ రాజకీయాలు చేస్తూ ఇంకా తన పరువును దిగజార్చుకుంటోందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 200 పడకల క్వారంటైన్లు ఉన్నాయని... చాలా చోట్ల క్వారంటైన్‌లో ఒక్కరు కూడ లేరంటే ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉన్నాయో చంద్రబాబు అర్థం చేసుకోవచ్చని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: