భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 6వేల 7వందల మందికి పైగా కరోనా సోకగా.. 2వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి తీవ్రత మరో వారం రోజులపాటు ఇలాగే కంటిన్యూ అవుతుందనే అంచనాల వేళ.. కట్టుదిట్టమైన చర్యలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఢిల్లీ, ముంబై నగరాలు కరోనా మెగా హాట్‌స్పాట్స్‌గా మారుతున్నాయి.

 

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి మత్తం 6వేల 761 మందికి కరోనా సోకింది. 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 516 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 678 కేసులు నమోదు కాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. పాజిటివ్‌ కేసులు మరో వారం రోజులపాటు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 

మహారాష్ట్రలో అత్యధికంగా 1364 కేసులు నమోదు కాగా 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 834 మంది కరోనా బారిన పడి 8 మంది చనిపోయారు. రాజస్థాన్‌లో కొత్తగా 57 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో మొత్తం రోగుల సంఖ్య 520కి చేరింది. కేరళలో మాత్రం వైరస్ కంట్రోల్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ 357 కేసులు నమోదు కాగా.. ఇద్దరు మాత్రమే చనిపోయారు. గుజరాత్‌లో 24 గంటల్లో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 308కి చేరింది. అయితే ఢిల్లీ, ముంబైలలో మాత్రం పరిస్థితి చేయిదాటుతోంది. ఢిల్లీలో 898 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 13 మంది చనిపోయారు. ముంబైలో 850 మందికి కరోనా సోకగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అసోంలో తొలి కరోనా మరణం నమోదైంది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.మిజోరాంలో ఇద్దరు కరోనాతో బాధపడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులన్నింటినీ ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది.

 

వైద్య పరికరాల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 15వేల కోట్ల రూపాయలతో కరోనా అత్యవసర ప్యాకేజీ ప్రకటించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. దీంతో వెంటిలేటర్లు, పీపీఈలతో పాటు అవసరమైన వైద్యపరికరాలు సమకూరుతాయని ఆయన వెల్లడించారు.


మరోవైపు కరోనా వైరస్‌ కట్టడికోసం వ్యాక్సిన్ల తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనేందుకు మాస్కులు ధరించడం అత్యంత ఆవశ్యకమని ఆయన అన్నారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


లాక్‌డౌన్ పొడిగించాలా లేదా అనే అంశంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నవేళ పలు రాష్ట్రాల లాక్‌డౌన్ పొడిగించేందుకు మొగ్గు చూపుతన్నాయి. ఒడిశా ఇప్పటికే లాక్‌డౌన్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. తాజాగా పంజాబ్‌కూడా అదే బాటలో నడిచింది. ఈ నెలాఖరు వరకూ పొడిగించింది. 

 

భారత్‌లో సామాజిక వ్యాప్తికి అవకాశం ఉందంటూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్‌-ICMR హెచ్చరించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం బారత్‌లో అలాంటి ఛాన్సే లేదని ప్రకటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: