ఆ ఏడుకొండలవాడు తెలుగు వారికే కాదు.. యావత్ భారత దేశంలో ఎందరికో ఇలవేల్పు. ప్రత్యక్ష దైవంగా పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామి కూడా ప్రస్తుతం కరోనా కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిత్యం ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో కళకళలాడే తిరుగిరులు కొన్ని రోజులుగా లాక్‌డౌన్ కారణంగా బోసిపోతున్నాయి. అయితే భక్తులను ఆదుకునే వేంకటేశ్వరుడు లాక్ డౌన్ కాలంలోనూ తన భక్తులకు ఆహారం అందిస్తున్నాడు.

 

 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రతి రోజూ తిరుపతిలో 30 వేల మంది నిరాశ్రయులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్‌, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది. తద్వారా ఎందరో అన్నార్థుల ఆకలి తీరుతోంది. వారంతా వేంకటేశ్వర స్వామి పేరు చెప్పుకుని కడుపు నింపుకుంటున్నారు.

 

 

ఇక లాక్‌ డౌన్‌ ఉన్నప్పటికీ... తిరుమలలో శ్రీవారి పూజలకు ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రాణాంతక కరోనా నేపథ్యంలో ఇప్పటికే శ్రీవారి దర్శనాలు నిలుపుదల చేసిన టీటీడీ పాలక మండలి..స్వామి వారికి యధావిధిగా కైంకర్యాలు, సేవలు కొనసాగిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు చేశారు. అయితే.. గత 20 రోజుల నుంచి కరోనా వ్యాధి నివారణకు, వ్యాధి సోకిన ప్రజలు కూడా త్వరగా నయం అయ్యి కోలుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 

 

భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసినప్పటికీ రోజు వారి జరగవలసిన కైంకర్యాలు, సేవలు యధావిధిగానే జరుగుతున్నాయి. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టీటీడీ తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: