ప్రయాణికుల‌కు గుడ్ న్యూస్‌..ఈ 14న లాక్‌డౌన్ ముగుస్తున్న నేప‌త్యంలో ఈ నెల 15 నుంచి పరిమిత సంఖ్యలో రైళ్లను తిప్పేందుకు రైల్వేశాఖ సిద్ధ‌మవుతోంది. అయితే.. రాష్ట్రాలు దాటకుండా రైళ్ల ను నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన‌ ప్రణాళికలను రైల్వే అధికారులు రూపొందించారు. ఏ ఏ మార్గాల్లో రైళ్లు నడపాలనే అంశంపైనా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌  ఉన్నతాధికారులతో సమావేశ‌మై చ‌ర్చించారు. ఈ మేర‌కు రైళ్లను ఏ మార్గాల్లో నడపాలి? ఏ విధంగా నడపాలి? ఒక‌వేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయి..? అనే అంశాలపై రైల్వే ఉన్నతాధికారులు ప్రతిపాదనల్ని రైల్వే బోర్డుకు అందించారు. అయితే దీనిపై రైల్వే శాఖ ఆదివారం నిర్ణయాన్ని వెల్ల‌డించే అవ‌కాశాలు ఉన్నాయి.  

 

రైల్వే అధికారులు ప్ర‌తిపాదించిన అంశాల్లో ప్ర‌ధానంగా ఇవి ఉన్నాయి.  లాక్‌డౌన్‌ తర్వాత రైళ్లను నడిపినా ఫ్లాట్‌ ఫాం టికెట్ల అమ్మకాలు నిలిపేయాలని అధికారులు అనుకుంటున్నారు. అందులో కూడా పరిమితంగా నడిపే రైళ్లను నాన్‌ స్టాప్‌గా తిప్పాలని నిర్ణయించారు. ప్ర‌యాణికులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌నుకూడా ప్ర‌స్తావించారు.  ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిపై రైల్వే అధికారులకు తప్పనిసరిగా అధికారుల‌కు సమాచారం ఇవ్వాలి.  ప్రయాణ సమయంలో జ్వరం వచ్చినా, కరోనా లక్షణాలు బయటపడినా మధ్యలోనే దించేస్తారు. బెర్త్‌ ఖరారైన వారికే ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వయోవృద్ధులకు అవ‌కాశం లేదు. కనీసం నాలుగు గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ధ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ ప‌రీక్ష‌ల త‌ర్వాతే రైలెక్కాలి. గ్లౌజులు, మాస్క్‌లతోనే బోగీల్లోకి అనుమతిస్తారు. రైలు బోగీలో క్యాబిన్‌కు ఇద్దరు ప్రయాణికులనే అనుమతిస్తారు.  ఇలా ముఖ్య‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌ను అధికారులు సిద్ధం చేశారు. అయితే.. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యం కూడా రైల్వేశాఖ‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: