డ్రాగన్ కంట్రీపై అగ్రరాజ్యం ప్రతీకారానికి దిగింది. అమెరికాలోని చైనా టెలికాం సంస్థ అనుమతుల్ని రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పుడు ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ ఏర్పడింది.  

 

కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా... ఆ దేశంపై ప్రతీకార చర్యల దిశగా సాగుతోంది. దేశ భద్రతకు ముప్పుందనే సాకుతో... అమెరికాలో సేవలందిస్తున్న చైనా టెలికాం సంస్థపై నిషేధానికి సిద్ధమవుతోంది. చైనా టెలికాం సంస్థపై ఆంక్షలు విధించాలని, అనుమతులు రద్దుచేయాలని ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌-FCCకి... రక్షణ, హోం, వాణిజ్య సహా అత్యున్నత శాఖలు సూచించాయి. 

 

చైనా టెలికాం వల్ల దేశ రక్షణ, భద్రత, ఆర్థిక, న్యాయ వ్యవస్థకు ముప్పుందని అధికార వర్గాలు గుర్తించాయని... ప్రజాప్రయోజనార్థం ఆ సంస్థ లైసెన్సులను FCC రద్దు చేయాలని న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఆమోదం పొందితే... చైనా టెలికాం సేవలు పొందుతున్న అమెరికాలోని లక్షలాది మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగదారులు కమ్యూనికేషన్‌ సంబంధాలు కోల్పోయే అవకాశం ఉంది. చైనా టెలికాం సంస్థపై బీజింగ్‌ దోపిడీ, నియంత్రణ, ప్రభావం ఉన్నాయని అమెరికా న్యాయశాఖ, వాణిజ్య శాఖలు అంటున్నాయి. 

 

అమెరికాపై చైనా సైబర్‌ నిఘాకు, ఆర్థిక గూఢచర్యం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా... అగ్రరాజ్యంలో చైనా టెలికాం ఆపరేషన్స్‌ ఉంటున్నాయని US న్యాయ శాఖ, వాణిజ్య శాఖలు అంటున్నాయి. అమెరికా కమ్యూనికేషన్లను కూడా దారి మళ్లిస్తోందని ఆరోపించాయి. దీంతో... ఇప్పుడు FCC ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇందులో వైట్‌హౌస్‌ జోక్యం ఉంటుందా? లేదా? అనేది  అమెరికన్లలో ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి చైనాపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార చర్యలకు దిగుతోంది. కరోనాపై సమాచారం ఇవ్వలేదనే ఆగ్రహంతో ఉన్న అమెరికా.. ఆ దేశానికి సంబంధించిన పలు కార్యకలాపాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: