కరోనాకు చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఇది ఇన్నాళ్లూ చెబుతున్న మాట. అయితే ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు, వైరాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని మార్గాలను అన్వేషించారు. అందులో ఒకటి ప్లాస్మా థెరపీ. ఇంతకీ ఏంటీ ప్లాస్మా థెరపీ ?

 

మందులేని రోగాన్ని నయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ప్లాస్మా థెరపీతో కరోనా రోగులకు నయం చేస్తామని అమెరికా సహా పలు దేశాల్లో వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం వైద్య విభాగాలు, డ్రగ్స్ కంట్రోల్‌ అధికారుల అనుమతి కోరుతున్నారు.  ట్రీట్మెంట్‌పై ఎవరూ  భయపడాల్సిన అవసరం లేదని... శతాబ్దంగా ఇలాంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అతని దేహంలో తయారయ్యే యాంటీబాడీస్‌.. అతను కోలుకున్న తర్వాత కూడా నెలల తరబడి ప్లాస్మాలో ఉంటాయంటున్నారు వైద్యులు. వాటిని ఉపయోగించుకుని ఇతరులకు వైద్యం చేసే వీలుంటుందని చెబుతున్నారు. అవి వ్యాక్సిన్‌లాగే పనిచేస్తాయని స్పష్టంచేశారు. 

 

1918లో ఫ్లూ జ్వరం మహమ్మారిలా వ్యాపించినప్పుడు దానికి ఆధునిక వైద్యం అందుబాటుకు రాలేదు. వైద్యులు అప్పుడు కోలుకున్న రోగుల ప్లాస్మాను వ్యాధిగ్రస్తుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు.  2002లో సార్స్‌ వచ్చినప్పుడు, 2014లో ఎబోలా వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్‌ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వైరస్‌కు కూడా ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు వైద్యనిపుణులు. ఇలా చైనా, దక్షిణ కోరియాలో చికిత్స చేసిన పేషెంట్లకు నయం కాగా.. భారీ స్థాయిలో దాన్ని వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోనూ దీనిపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు.

 

కేరళలో ప్లాస్మా పరీక్షలకు ఐసీఎంఆర్ అనుమతి  ఇచ్చింది. అయితే ఇంకా డ్రగ్స్ కంట్రోల్ శాఖ నుంచి అనుమతి  రాలేదు. ఎవరైనా కరోనా సోకి కోలుకున్న వ్యక్తి ఉంటే.... అతని యాండీబాడీ లెవెల్ కోసం పరీక్షలు చేస్తామని, అందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి కావాలని కేరళ వైద్య శాఖ అంటోంది. ఇది రక్తదానం లాంటిది కాదని, కేవలం ప్లాస్మా సేకరణ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెంటలేటర్ పై ఉన్న వారికి మాత్రమే ఈ చికిత్స అందిస్తారని వైద్య నిపుణులు  చెబుతున్నారు. త్వరలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని,, ఈ లోపే ప్రభుత్వ అనుమతి లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.. 

 

ప్లాస్మా థెరపీలో సేకరించిన యాంటీ బాడీస్‌తో రెండు నుంచి నాలుగు డోస్‌లు మాత్రమే తయారు చేసే వీలుంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగికి ఒక డోస్  మాత్రమే సరిపోతుందని వైద్యులు తేల్చారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 17 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులనే దాతలుగా పరిగణిస్తారు. వాళ్లు  కనీసం 55 కిలోల బరవుండాలి. గత 14 రోజులుగా ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా ఉండాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: