కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. కొవిడ్-19 వైరస్ చికిత్సలో కీలకంగా మారనున్న ప్లాస్మాథెరపీ ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాను కొవిడ్-19 రోగుల చికిత్సకు వినియోగిస్తారు. పలు దేశాలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. భారత్లో మొదట కేరళలో చేపట్టారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో కూడా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. దీంతో రీసెర్చ్ విషయంలో హైదరాబాద్ దేశం చూపు ఆకర్షిస్తోంది. ఈ పరిధోధనలు విజయం సాధిస్తే చరిత్ర సృష్టించడం ఖాయమని పేర్కొంటున్నారు.
ప్లాస్మా థెరపీపై కేరళలోని శ్రీచిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఆమోదం తెలిపింది. ఈ చికిత్స అమలుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్టు ఐసీఎమ్మార్ అధికారులు తెలిపారు. ప్లాస్మాథెరపీ ప్రొటోకాల్ రూపొందిస్తున్నామని, ఇది చివరి దశలో ఉన్నదని చెప్పారు.
కాగా, పలు రాష్ర్టాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్పై పోరాడుతోందని ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోనాపై యుద్ధంలో భారత్ తప్పక గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటానికి రాష్ర్టాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందన్నారు. లాక్డౌన్ను మరో 2 వారాలు పొడిగించాలని ప్రధానిని కోరారు. కరోనా కట్టడికి లాక్డౌన్ బాగా ఉపయోగపడిందన్నారు. కరోనా సమర్థ నియంత్రణకు లాక్డౌన్ను కనీసం రెండు వారాలపాటు కొనసాగించడం మంచిదని అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయదారుల కోసం ఏం చేయాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలో వ్యూహం ఖరారు చేసి అమలు చేయాలన్నారు.