ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి జగన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిరంతరం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే.. ఏపీలో మొత్తం 676 మండలాలు ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్ సోకిన రెడ్జోన్లలో 37 మండలాలు ఉన్నాయి ఆరెంజ్ జోన్లలో 44 మండలాలు ఉన్నాయి. అంటే మొత్తం కరోనా వైరస్ ప్రభావం ఉన్న మండలాలు 81 ఉన్నాయి. గ్రీన్ జోన్లో 595 మండలాలు ఉన్నాయి. అంటే ఈ మండలాల్లో కరోనా ప్రభావం లేదు. దాదాపుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఇప్పటివరకు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలో ఆసక్తినిరేపుతోంది. ఇప్పటికే ఈ మండలాల్లో లాక్డౌన్ సడలింపు ఇవ్వాలని ప్రధాని మోడీని ఆయన కోరారు. నిన్న ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్ను రెడ్, ఆరెంజ్ జోన్లకే పరిమితం చేస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు.
అదే విధంగా లాక్డౌన్ కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బ తిన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో జనం గుమిగూడకుండా మాల్స్, సినిమా హాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజా రవాణా, పాఠశాలలపై లాక్డౌన్ కొనసాగించాల్సిందేనని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరులో మీతో కలిసి నడుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే విధంగా లాక్డౌన్ పొడిగిస్తే.. సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంరగా మారుతోంది. ఏపీలో కరోనా ప్రభావం లేని 595 మండలాలను ఏం చేస్తారన్నదానిపై ఆప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. నిజానికి.. ఇప్పటికే పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఏపీ సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి మరి.