ప్రపంచాన్ని భయంతో వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే లక్ష దాటిన మరణాలు.. లక్షల్లో కేసులు. కరోనా చైనా తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో విపరీత ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ జరిగే మరణాలు చూస్తుంటే కరోనా ఎంతటి ఉపద్రవాన్ని సృష్టిందో అర్థం అవుతుంది. కరోనా మహమ్మారిని కట్టడి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యావత్తు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యా ప్తి చెందకుండా తగు ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు నిత్యావసరాలను అందించే నిమిత్తం దేశ వ్యాప్తంగా ‘సురక్ష స్టోర్స్’ ను ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొంత మంది కరోనా బూచి చూపిస్తూ.. అడ్డగోలిగా రేట్లు పెంచుతున్నారని.. దాంతో సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కూరగాయలు, ఆకు కూరల, పండ్లు ఎంత రేట్లు పెరిగిపోతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ఆలోచనతో ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రైవేట్ ఫర్మ్స్ తో ప్రభుత్వం ముందు కెళ్తుందని, కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తయారీ యూనిట్ల నుంచి రిటైల్ అవుట్ లెట్ల వరకూ సప్లయ్ చైన్ మొత్తం తగు ప్రమాణాలు పాటించేలా చూస్తుందని తెలుస్తోంది.
వచ్చే 45 రోజుల్లో ‘సురక్ష స్టోర్స్’ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని సంబంధిత వర్గాల సమాచారం. దుకాణం వెలుపల, బిల్లింగ్ కౌంటర్ల వద్ద 1.5 మీటర్ల సామాజిక దూరం, వినియోగదారులు దుకాణాలలోకి ప్రవేశించే ముందు సానిటైజర్ లేదా హ్యాండ్వాష్ సదుపాయం, మొత్తం సిబ్బందికి మాస్క్ లు, రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేయడం లాంటివి పాటించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఈ విషయంపై ‘సురక్ష స్టోర్స్’ వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి పవన్ కుమార్ అగర్వాల్ ను మీడియా ప్రశ్నించగా ఇందుకు సంబంధించిన వివరాలను చెప్పేందుకు ఆయన నిరాకరించారు.