సాధారణంగా ఎవరైనా పామును చూస్తేనే ఆమడదూరం పారిపోతారు. అలాంటి వాళ్లు పాము కళ్లెదుటే కాదు, కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. మరి కొందరైతే పాము కనిపిస్తే చాలు అది ఎక్కడ వారిపై దాడి చేస్తుందో అని ముందే దాన్ని కొట్టి చంపేస్తారు. పాములంటే మనుషుల్లో వ్యాపించిన భయం ఈనాటిది కాదు. ఈ భయానికి మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పాముల అంటే భయం ఉండడానికి ప్రధాన కారణం.. అవి కాటేస్తే ప్రాణాలకు ప్రమాదమని. అందుకే పాములను చూస్తే భయపడతారు.
కానీ, ఓ మహిళ మాత్రం 50 తాచుపాము పిల్లల్ని చాలా ధైర్యంగా మట్టుపెట్టేసింది. అది చూసి నోరెళ్లబెట్టడం స్థానికుల వంతు అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన కొంక లచ్చల్ మరియు అతని భార్య స్వరూపతో కలిసి తన వాకిట్లోని బండ రాళ్లను తొలగిస్తున్నాడు. ఓ రెండు రాళ్లు తొలగించగానే తాచుపాము పిల్లలు కనిపించాయి. ఈ క్రమంలోనే ఒకదాని తర్వత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. అవి చూసిన భార్య ఇవేం పాములు అంటూ అరవసాగింది. దీనికి సమాధానంగా భర్త.. దూరంగా ఉండు.. ఇవి తాచుపాము పిల్లలు.. విషం ఉంటుందని చెప్పాడు.
దీంతో భర్య వెంటనే ఇంటి లోపలకి పరిగెత్తి పెద్ద కర్రను తీసుకుంది. ఇక ముందూ వెనకా ఆలోచించకుండా ఒక్కో పామునూ చప్పడం మొదలుపెట్టింది. అలా ఒక్కో రాయీ తొలగించగా కుప్పలు తెప్పలుగా పాము పిల్లలు బయటికొచ్చాయి. దేన్నీ వదలకుండా ఆమె ఏమాత్రం భయం లేకుండా చంపుతూనే ఉంది. మొత్తానికి ఆమె దాదాపు 50 పిల్లల్ని చంపేసింది. దీంతో భర్త నోట మాట లేదు. షాకై అలా చూస్తూ ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సైతం ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. విష సర్పాలు కావడం వల్ల ప్రాణభయంతో వాటిని ఆమె చంపేసింది.