ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి సృష్టిస్తున్న షాకులు పరంపర కొనసాగుతోంది. చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి .. ఇప్పుడు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. ఓవైపు ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుందనే ప్రచారం జరుగుతుండగా తాజాగా షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. మళ్లీ వైరస్ విజృంభించడం.
చైనాకు చెందిన నిపుణుడు జాంగ్ వెన్హాంగ్ తాజాగా ఈ సంచలనం వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అనేక దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటం... పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఇదంతా కేవలం తొలి దశ మాత్రమే. అయితే ఈ ఏడాది నవంబర్లో రెండవ సారి వైరస్ మళ్లీ విజృంభిస్తుందని వెల్లడించారు. కానీ మొదటి దశ కన్నా.. రెండవ దశలో వైరస్ సంక్రమణ తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. అతి స్వల్పరీతిలో వైద్య సదుపాయాలు ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా లాంటి ఖండాల్లో రాబోయే శీతాకాలంలో వైరస్ ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, తారాస్థాయికి వెళ్లే ఈ వైరస్తో ప్రమాదమేనని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, కరోనా దక్షిణాసియా దేశాల్లోనూ నెమ్మదిగా విస్తరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇండియా, పాక్లో వేలల్లో ఉండగా...మిగతా దేశాల్లో మాత్రం కేసులు వందల్లోనే ఉంది. ముఖ్యంగా ఇండియాలో కేసులు పెరగడానికి ప్రధాన కారణం తబ్లిఘి జమాత్ మత ప్రార్థనలు. భారత్ లో మాత్రం ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కారణంగా కేసులు పెరిగినట్టు అధికారిక ప్రభుత్వ గణాంకాలు చూస్తే అర్ధమవుతోంది. పొరుగున ఉన్న పాక్కు మాత్రం ఇరాన్ నుంచి వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. ఇరాన్ నుంచి పాక్ కు వేలాదిమంది ప్రయాణ చరిత్ర కలిగివుండటం మూలాన అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శ్రీలంక , బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ దేశాలలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ భయం మాత్రం ఆవహించింది. మొత్తంగా దక్షణాసియాలోని దేశాల్లో భారతదేశంలో 9,152, వాటిలో 308 మరణాలు, పాకిస్తాన్ 5,374, 93 మరణాలు ఉన్నాయి.. బంగ్లాదేశ్ 621, 34 మరణాలు, ఆఫ్ఘనిస్తాన్లో 607 కేసులు నమోదుకాగా.. 607 కేసులు ఉన్నాయి.