అగ్రరాజ్యం అమెరికాను కోవిడ్ వణికిస్తోంది. కరోనా వైరస్ విషయంలో చైనా ఊహించని రికార్డులను నమోదు చేసుకుంటోంది. అదే సమయంలో దారుణమైన పరిస్థితులను అనుభవిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల కేసులు నమోదుకాగా, ఇందులో 30 శాతం ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. ఒక్క న్యూయార్క్ నగరంలోనే బాధితుల సంఖ్య లక్ష దాటింది. చైనా, బ్రిటన్ కన్నా ఈ సంఖ్య చాలా ఎక్కువ. మరోవైపు, అమెరికాలోని డెట్రాయిట్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ నగరంలోని సినాయ్ గ్రేస్ హాస్పిటల్లో.. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ సమయంలో ట్రంప్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య ఐదున్నర లక్షలు దాటింది. మృతుల సంఖ్య సైతం అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు 22 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. అమెరికా మొత్తం కేసుల్లో 20% కేసులు న్యూయార్క్లోనే తేలాయి. న్యూయార్క్ అధికారుల సమాచారం ప్రకారం నగరంలో ఆదివారం ఒక్కరోజే 5,695 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,04,410కు పెరిగింది. మృతుల సంఖ్య 6,898గా నమోదైంది. రాష్ట్రంలో కరోనా ఒక్కరోజులోనే 758 మందిని పొట్టన పెట్టుకున్నదని న్యూయార్క్ గవర్నర్ ఆండ్యూ క్యూమో పేర్కొన్నారు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నదని చెప్తూనే.. ఆర్థిక కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
కాగా, డెట్రాయిట్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువవడంతో.. మరణించిన వారినే మార్చురీలోనే ఉంచుతున్నారు. మార్చురీలో ఉన్న రీఫ్రిజిరేటెడ్ రూమ్తో పాటు స్టడీ రూమ్లోనూ శవాలను దాచిపెడుతున్నారు. రాత్రిపూట మార్చురీ ఉద్యోగులు పనిచేయకపోవడంతో... ఆ శవాలను తరలించేవారు దొరకడంలేదు. దీంతో కొత్తగా సంభవిస్తున్న మరణాలకు సంబంధించిన మృతదేహాలను హాస్పిటల్లోని వివిధ రూముల్లోకి తరలిస్తున్నారు. అమెరికాకు చెందిన ఓ టీవీ ఛానల్ ఈ ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ వర్కర్లు కూడా ఈ ఫోటోలను ద్రువీకరించారు.
ఇలా అమెరికాలో దారుణ పరిస్థితులు ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికపై మండిపడ్డారు. కరోనా గురించి నిపుణులు ముందే హెచ్చరించినా ట్రంప్ పట్టించుకోలేదని, ఆయన ఒంటెద్దు పోకడల వల్లే ఈ దుస్థితి తలెత్తిందంటూ ఆ పత్రికలో వచ్చిన కథనంపై మండిపడ్డారు. ‘ఆ పేపర్ మాదిరిగానే వార్త కూడా నకిలీ’ అంటూ విరుచుకుపడ్డారు.