అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు, మెరుగైన వైద్య సదుపాయాల కారణంగా ఆదేశం కాస్త కరోనా విలయతాండవం నుంచి తేరుకున్నట్లే కనబడుతోంది. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే వాస్తవిక గణాంకాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ పట్టణాల్లోని హాట్స్పాట్ కేంద్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. ఓ దశలో వేల కొద్దీ మరణాలు, పాజిటివ్ కేసులతో అమెరికాలో పరిస్థితి భయానకంగా కనిపించినా తాజాగా ఉధృతి, వ్యాప్తి తగ్గుతున్నట్లు కేసుల సంఖ్యను పరిశీలిస్తే అర్థమవుతుంది.
కొద్దిరోజుల క్రితం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కరోనా అమెరికాలో అదుపులోకి వస్తున్న వేళ సాధ్యమైనంత తొందరగానే లాక్డౌన్ ఎత్తివేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అమెరికాలో కరోనాను చాలా వరకు నియంత్రించగలిగాం. మేము తీసుకున్న కొన్నిచర్యలు ఎంతగానో పనిచేశాయి. ప్రజల నుంచి కూడా మంచి సహకారం లభిస్తోంది. సందర్భంగా నేను అమెరికా పౌరులు అభినందించదల్చుకున్నానని అన్నారు. వైర్స్పై యుద్ధంలో నిర్ణయాత్మక పురోగతి సాధించామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. ఇదిలా ఉండగా 'పాడు కాలం ముగిసింది' అంటూ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కొమో ప్రకటన చేశారు.
సాధ్యమైనంత త్వరలో లాక్డౌన్ ఎత్తివేయాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పత్రికాముఖంగా వెల్లడించారు. సాధారణ జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గడువు కంటే ముందే దేశమంతా కట్టడి తొలగిపోతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికాలో రెండు లక్షలకు పైగా మరణాలు సంభవిస్తాయని ట్రంప్ గతంలో వ్యాఖ్యనిచండంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే తమ ప్రభుత్వం వేగంగా తీసుకున్నచర్యలతోనే కరోనా ప్రమాదం చాలా వరకు తగ్గిందని ట్రంప్ సమర్థించుకున్నారు. యూర్పతో పోల్చితే అమెరికాలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని పేర్కొనడం గమనార్హం.