ఇప్పుడంతా కరోనా టెన్షనే. ప్రపంచం అంతా కరోనాతో అట్టుడికి పోతోంది. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షా 37 వేల మంది మరణించారు. దాదాపు 20 లక్షల మందికి ఆ వైరస్ సంక్రమించింది. లాక్డౌన్ వల్ల జనం సతమతం అవుతున్న పరిస్థితి. అయితే, ఇంకో కొత్త ట్రెండ్ తెరమీదకు వచ్చింది. స్వేచ్ఛాయుత వాతావరణానికి అలవాటుపడిన అమెరికన్లు, స్వేచ్ఛగా బతుకుదాం లేదా చద్దాం అనే నినాదాన్ని ఎత్తుకొని రోడ్లపైకి ఎక్కి ఆందోళన చేస్తున్నారు. కరోనా వ్యాప్తి పేరుతో షరతులు విధించడం వల్ల ఎన్నాళ్లీ మాస్క్లు ధరించి, నిబంధనల చట్రంలో బతకాలని ఆక్రోశిస్తున్నారు. రోడ్ల పైకి తమ వాహనాలతో వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న తీరు ఆందోళనను రేకెత్తిస్తోంది.
అమెరికా ప్రజల్లో మాత్రం అసహనం పెరిగిపోతోంది. ఎన్నాళ్లీ మాస్క్లు ధరించి, నిబంధనల చట్రంలో బతకాలని అమెరికన్లు ఆక్రోశిస్తున్నారు. కెంటుకీ, లాన్సింగ్, మిచిగాన్, తదితర రాష్ట్రాల్లో నిరసనలకు దిగగా టెక్సాస్, ఓరిగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు ఈ కరోనా వ్యతిరేక కట్టడి నిరసనలకు నాయకత్వం వహిస్తుండటం, నిబంధనలను వెంటనే ఎత్తివేయాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లపై ఒత్తిడి తెస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
స్థూలంగా ఇప్పుడు ప్రజలు వర్సెస్ పాలకులు అన్నట్లుగా మారింది అమెరికాలో పరిస్థితి. అమెరికాలో మే 1వ తేదీ లోపలే మళ్లీ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. అయితే, అంత తొందరేమీ లేదని, ముందు కరోనాను సంపూర్ణంగా నిరోధించిన తర్వాతే ఇతర అంశాల గురించి ఆలోచించాలని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు పట్టుబడుతున్నారు. అలాస్కా, హవాయి, మైనే, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకొటా, వెర్మొంట్, వెస్ట్వర్జీనియా రాష్ట్రాల్లో కేసులు తక్కువగానే ఉన్నాయని, ఈ రాష్ట్రాల్లో అతి త్వరలోనే నిబంధనలు సడలిస్తారని శ్వేతసౌధం చెబుతోంది. ఏదేమైనా..అమెరికాలోని ఆందోళనలు చర్చకు తెరలేపుతున్నాయి.