భారతదేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో కొత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,236కు చేరింది. ఇలా కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో ఆ రాష్ట్ర సీఎం కీలక నిర్ణయం వెలువరించారు. కరోనాపై పోరు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కనీసం మూడు నెలల పాటు ఇంటి కిరాయి వసూళ్లను వాయిదా వేసుకోవాలని, వారిని ఇళ్లలో నుంచి ఖాళీ చేయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇంటి యజమానులను ఆదేశించింది.
దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 24న 21 రోజులపాటు లాక్డౌన్ను ప్రకటించింది. అయితే కేసుల సంఖ్య తగ్గకపోవడంతో లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించింది. దీంతో కిరాయిదారులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకపోవడం, ఎలాంటి పనులు లేకపోవడంతో ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. కరోనా సంక్షోభంలో కొంతమంది ఉద్యోగాలతో పాటు ఉపాధి కోల్పోయారు. చాలా మంది వలస కార్మికులు, కూలీలు పొట్ట నిండటమే కష్టంగా మారింది. ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానులు అద్దె వసూలు చేయడాన్ని కనీసం మూడు నెలలు వాయిదా వేయాలని మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సూచించింది.
ఇంటి కిరాయిలు, భూములకు సంబంధించిన కిరాయిలను ఇంటి యజమానులు, భూస్వాములు వారిని కిరాయిలు అడగకూడదని ప్రభుత్వం సూచించింది. కిరాయిలు చెల్లించే స్తోమత లేకవడంతో వారిపై ఒత్తిడి తీసుకురావద్దని యజమానులను ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇదిలాఉండగా, మహరాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ రోజు నమోదైన 34 కేసుల్లో పుణెకు చెందినవారు 23 మంది ఉన్నారు. మరో ఆరుగురు ముంబైకి సంబంధించినవారు. దేశంలో ఇప్పటివరకు 13387 కేసులు నమోదు కాగా, 437 మంది మరణించారు.