కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అన్ని రకాల కార్యక్రమాలను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మన దేశంలో కొందరు తమ ఇంట్లో వేడుకలు కానిస్తున్నారు. తాజాగా బెంగళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ఈ వివాహం వివాదాస్పదంగా మారింది. కానీ బ్రిటన్లో అలా కాదు. ఔను. బ్రిటన్ రాచకుటుంబం అయినప్పటికీ...వివాహం వాయిదా వేసుకుంది. ఔను కరోనా సెగ రాచకుటుంబంపై పడింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవరాలు పెళ్లి జరగాల్సి ఉండగా..కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడినట్లు సమాచారం. ఇప్పటికే రాచ కుటుంబలో ప్రిన్స్ చార్లెస్కు కరోనా సోకి.. చికిత్స అనంతరం దాన్నుంచి కోలుకోగా...తాజాగా కరోనా ఎఫెక్ట్ వారింట్లో జరిగే వేడుకపై పడటం గమనార్హం.
బ్రిటన్ యువరాణి బియట్రైస్-ఎడోయార్డో పెళ్లి వచ్చేనెలలో జరగాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఒకసారి వాయిదా పడిని ఈ మ్యారేజ్ మరోసారి కూడా వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే పరిస్థితి సద్దుమణిగాక ఈ పెళ్లి గురించి ఆలోచించే అవకాశముంటుందని తెలిపాయి. అయితే ఈ పెళ్లి గురించి మాత్రం రాచకుటుంబ వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా బ్రిటన్లో లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 వేలకుపైగా మరణాలు సంభవించాయి.
ఇదిలాఉండగా, కరోనా వైరస్ బారినపడ్డ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన సతీమణి సైమండ్స్ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఆకాంక్షించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడినప్పటికీ ప్రస్తుతం కోలుకున్నానని బోరిస్ జాన్సన్ భార్య సైమండ్స్ కూడా ప్రకటించారు. బోరిస్ జాన్సన్ భార్య గర్భవతి కావడంతో ఆమెతో ఫోన్లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని దంపతులు సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.