కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత నేపధ్యం లో ఈ నెల 20 వ తేదీ తరువాత ఆంక్షలతో లాక్ డౌన్ సడలించే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది . ఆంక్షలతో లాక్ డౌన్ సడలించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టింది . ఆంక్షలతో లాక్ డౌన్ సడలించే అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయంతో ఉన్నారు . తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ... లాక్ డౌన్ కొనసాగింపుకే మొగ్గు చూపుతుండగా , ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంక్షలతో లాక్ డౌన్ సడలింపుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు .
రెడ్ జోన్ ఏరియా ను మినహాయించి , మిగతా ప్రాంతాల్లో ఆంక్షలతో లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు . అయితే జగన్మోహన్ రెడ్డి అభిప్రాయంతో కేసీఆర్ ఏకీభవించడం లేదు . కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని ఆయన భావిస్తున్నారు . లాక్ డౌన్ ఎత్తివేస్తే రోడ్లపైకి వచ్చే ప్రజలను కట్టడి చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు . ఎన్ని ఆంక్షలు విధించినా, ప్రజల్ని రోడ్లపైకి రాకుండా కట్టడి చేయడం అసాద్యమని భావిస్తోన్న కేసీఆర్ , మే మూడవ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలన్న భావనతో ఉన్నారు .
ఈ నెల 23 వతేదీ నుంచి పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానుండడం తో , ఇప్పటికే సామూహికంగా మసీదుల్లో నమాజు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది . సామూహిక ప్రార్ధనలు చేయకుండా, మతపెద్దలతో ప్రభుత్వ ప్రతినిధులు కూడా సమావేశం కావాలని నిర్ణయించారు . తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తుంటే ఈ నెల 20 వతేదీ తరువాత యధావిధిగా లాక్ డౌన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి .