ఒక్కరి నిర్లక్ష్యం దాదాపు వంద మందికి ప్రాణ సంకటంగా మారింది. పేషంట్‌కు చికిత్స చేసే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం పాతబస్తీలోని చాలా మందిని ప్రమాదంలోకి నెట్టింది. అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధురాలికి చికిత్సతో మొదలైన ఈ వ్యవహారం... 80 మందికి కరోనా వ్యాపించేలా చేసింది. ఇంతకీ వృద్ధురాలికి కరోనా ఎలా వచ్చింది..? మరో 80 మందికి ఎలా వ్యాపించిందో తెలుసా..? 

 

హైదరాబాద్‌ పాతబస్తీ తలాబ్ కట్టాలో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పడు అనేక మంది ప్రాణాల మీదకు తెచ్చింది.  భవానీనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను స్థానికంగా గల ఒక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి అదే ప్రాంతంలో వున్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే వృద్ధురాలికి కరోనా సోకిందేమోననే సందేహం డాక్టర్లకు గాని, వైద్య సిబ్బంది గాని రాలేదు. దీంతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా చికిత్స చేశారు. అయితే వృద్ధురాలు చనిపోవడంతో సాధారణ మరణంగానే భావించారు. బంధువులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ... శాంపిల్స్‌ సేకరించిన అధికారులు... రిపోర్టుల్లో కరోనా పాజిటీవ్‌ రావడంతో అప్రమత్తమయ్యారు. 

 

వృద్ధురాలి కుటుంబంలో ఒకరు ఇటీవల ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చారు. ప్రైమరీ కాంటాక్ట్‌ పద్ధతిలో వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకింది. అయితే... ఈ విషయాలేవీ వాకబు చేయకుండానే వృద్ధురాలికి చికిత్స చేశారు డాక్టర్లు. అయితే, వృద్ధురాలు కరోనాతో చనిపోయిందని నిర్ధారణ కావడంతో... కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించారు అధికారులు. దీంతో 22 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. మరికొందరి రిపోర్టులు అందాల్సి ఉంది. వీళ్లందర్నీ ఆస్పత్రులకు తరలించి, వాళ్లతో కలిసి మెలసి తిరిగిన వాళ్లను గుర్తించే పని ప్రారంభించారు అధికారులు.  


 
వృద్ధురాలికి చికిత్స చేసిన ముగ్గురు డాక్టర్లు, నలుగురు నర్సులు కరోనా బారిన పడ్డారు. అలాగే వృద్ధురాలి బంధువులు, వైద్య సిబ్బందితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వాళ్లను కలుపుకుంటే 80 మందికి పైగా ప్రమాదంలో పడ్డారు. వృద్ధురాలికి చికిత్స చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదంటున్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: