దేశానికి ఒకడే మోడీ. నిజానికి బీజేపీకి కూడా మోడీ ఒక్కరే. బలమైన నేతగా దేశ ప్రధానిగా మోడీ ఖ్యాతి వినుతికెక్కింది. ఇక జాతీయ రాజ‌కీయ మైదానంలో మోడీని కొట్టేవారు ఇప్పటికైతే ఎవరూ  లేరన్నది కఠిన  నిజం.

 

ఇన్ని  ప్లస్ పాయింట్ల మధ్య మధ్య మోడీ మోజు రోజు రోజుకు పెరిగిపోతోది. సరే దేశం సంగతి పక్కన పెడితే  ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోడీకి జి అనే వారు ఎక్కువైపోయారు. వారూ వీరూ లేకుండా చంద్రబాబు మొదలుకుని సుజనా చౌదరి వరకూ మోడీని తెగ వాడేసుకుంటున్నారు.

 

జగన్ తిట్టాలంటే మోడీని అడ్డం పెట్టుకుంటున్నారు. మోడీ చూస్తే ఊరుకోరు సుమా. మోడీ చెప్పినట్లుగా చేయడంలేదు, మోడీకి చెబుతాను అంటూ ఒకటే బెదిరింపులు. అక్కడికి కేంద్రం, మోడీ జేబులో ఉన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. 

 

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అయితే కేంద్రం చెప్పినట్లుగా జగన్ చేయడంలేదు, కేంద్ర మార్గదర్శకాలను పాటించడంలేదు. ఇలాగైతే సీరియస్ యాక్షన్ తప్పదు, కేంద్రం ఊరుకోదు అంటూ గట్టి కాషన్ ఇచ్చేశారు.

 

మరో వైపు చూసుకుంటే చంద్రబాబు ఆయన మాజీ మంత్రులు కూడా మోడీ ఎంత బాగా చేస్తున్నారు. ఆయన చెప్పిందేంటి, లాక్ డౌన్ వేళ కేంద్రం చెప్పిన‌ట్లుగా చేయాలి కదా అంటూ గట్టిగానే తగులుకుంటున్నారు. ఇక జనసేనకు ఎటూ బీజేపీతో పొత్తు ఉంది. దాంతో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా మోడీ ప్రస్తావన తెస్తున్నారు.

 

మోడీ ఈ దేశాన్ని కాపాడుతున్న దేవుడు అంటున్నారు. మోడీ దేశంలో కరోనా కట్టడికి బాగా చర్యలు తీసుకుంటూ ఉంటే ఏపీలో జగన్ మాత్రం వాటిని కనీసంగా ఆచరించడం లేదని విమర్శిస్తున్నారు. ఇలాగైతే మోడీతో చెబుతామని కూడా బెదిరిస్తున్నారు.

 

మొత్తం మీద చూసుకుంటే అసలు బీజేపీ నేతల కంటే ఈ కొసరు నేతలే మోడీ భజన చేస్తున్నారు. అంతేనా మోడీలుగా తామే మారిపోయి జగన్ని ఒక లెక్కన హచ్చరించేదాకా వచ్చేశారు. 

 

చేతిలో అధికారం లేకున్నా అప్పనంగా మోడీ పేరు చెప్పుకుని అధికారాన్ని అప్పనంగా అనుభవించే నేతలు  బాపతు ఇపుడు బాగానే తయారయ్యారనుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: