నోవల్ కరోనా వైరస్... సృష్టికర్త అని ప్రపంచవయ్ఆప్తంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న చైనా మొదటి సారిగా దీనిపై స్పందించింది. అయితే ఎప్పట్లాగే బుకాయింపులతో కాలం గడుపుతోంది. వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందినట్లు ప్రపంచం అంతా అనుమానించడం, అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 లేదా వైరస్ తెలిసీ వ్యాప్తి చేసి ఉంటే చైనా అందుకు తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో, ఆ వైరస్ మా నుంచి రాలేదని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వైస్ డైరక్టర్ యువాన్ జిమింగ్ తెలిపారు.
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో రీసర్చర్గా, వుహాన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబరేటరీలో డైరక్టర్గా విధులు నిర్వహిస్తున్న జిమింగ్ వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకైనట్లు వచ్చిన వార్తలను యువాన్ ఖండించారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ వచ్చిందన్న పుకార్లను కుట్ర ప్రకారం క్రియేట్ చేశారని, కేవలం ప్రజల్ని అయోమయంలో పడేసేందుకు ఈ పన్నాగం వేశారన్నారు. అమెరికా పత్రికలు, నేతలు అదే పనిచేస్తున్నారన్నారని ఆయన ఆరోపించారు. కేవలం నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. వదంతులు పుట్టిస్తున్న వాళ్లు తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.. కానీ మేం సైంటిఫిక్ మేనేజ్మెంట్తో పనిచేస్తున్నామని యువాన్ తెలిపారు. ఇది ఎంత మాత్రం మనిషి తయారు చేసిన వైరస్ కాదన్నారు. తమకు కరోనా గురించి తెలియగానే, డబ్ల్యూహెచ్వోతో దాని జీనోమ్ సీక్వెన్స్ పంచుకున్నామన్నారు. యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో ఉన్న బీఎస్ఎల్ ల్యాబ్ల తరహాలోనే వుహాన్ ల్యాబ్స్ ఉన్నాయన్నారు.
వుహాన్ ల్యాబ్లో గబ్బిలాల నుంచి వస్తున్న వైరస్ల గురించి స్టడీ జరుగుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే గుర్తించాయి. దీంతో ఆ ల్యాబ్పై అనుమానాలు ఎక్కువయ్యాయి. ల్యాబ్లో ఉన్న ఓ విద్యార్థి నుంచి వైరస్ బయటకు ప్రబలినట్లు అమెరికా తన కథనాల్లో ఆరోపిస్తున్నది. అయితే, ఈ వైరస్ గురించి పబ్లిక్గా మాట్లాడిన ల్యాబ్కు చెందిన తొలి వ్యక్తి జిమింగ్ మాత్రమే.