ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడనే సామెత మనకు తెలిసిందే. అలా చైనా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయింది. ఔను. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఆ దేశ జీడీపీ ఐదు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో తను సృష్టించిన వైరస్ అనే అపవాదు ఎదుర్కుంటున్న చైనా ఈ షాక్ను సైతం మూసుకొని భరించాల్సి వస్తోంది.
చైనా వ్యాపార,రిటైల్, ఇతర విక్రయాలు మునుపెన్నడూ లేని రీతిలో దారుణంగా పడిపోయాయి. చైనా ఆర్థికంలో 80 శాతం వాటా కలిగిన రిటైల్ ఖర్చులు 19 శాతానికి పడిపోవడం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో వృద్ధిరేటు 6.8 శాతం కుంచించుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. 1979లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారని నిపుణలు తెలిపారు. వైరస్ అదుపులోకి వచ్చిన నెల రోజుల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని అంచనావేసిన ఆర్థిక వేత్తలు తమ అంచనాలను వెనక్కి తీసుకోవడం చైనా దుస్థితికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
ఇదిలాఉండగా చైనాకు మరో షాక్ తగులుతోంది. చైనా కంపెనీల లావాదేవీలపై అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. చైనా కంపెనీలు ఇటీవల పలు దేశాల్లో తక్కువ ధరకు ఆస్తులను కొనుగోలు చేయడంతో వాటి లావాదేవీలపై ప్రపంచవ్యాప్తంగా నిఘా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు జరిపే ఆస్తుల కొనుగోళ్లపై అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు కూడా విధించాయి. ఇదే ఒరవడిలో చైనా కంపెనీలు, బ్యాంకులు భారత్లో జరుపుతున్న ఈక్విటీ లావాదేవీలపై మన దేశానికి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ దృష్టి సారించినట్టు వార్తలు వస్తున్నాయి.