కేంద్రం నిర్ణ‌యం ప్ర‌కారం మే 3 వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ విధించడానికే ప‌రిమితం కాకుండా...మే 7వ తేదీ వ‌ర‌కు సైతం లాక్‌డౌన్ కొన‌సాగిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పోలీసులు ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించారు.  తాజాగా తెలంగాణ‌ డీజీపీ మహేందర్‌ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

 

వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించామ‌ని డీజీపీ వెల్ల‌డించారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించాం. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు.

 


కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయని డీజీపీ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ర్ట వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలి. నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. 

 

సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలి. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచించారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: