పొరుగునే ఉన్నప్పటికీ... పక్కలో బల్లెంలా మారిన చైనాకు మన సత్తా ఏంటో రుచి చూపించారు. కరోనా దెబ్బకు దేశీయ కంపెనీలన్ని భారీగా నష్టపోతోన్న సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకుని, ఇండియన్ కంపెనీల్లో చైనా వాటాలు పెంచుకోవాలని చూస్తోంది. అయితే, స్థానిక కంపెనీలను రక్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనదేశంతో సరిహద్దు పంచు కుంటున్న దేశాలు ఇక ఇండియన్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి పొందాల్సిందే! ఈ నిర్ణయం తాజాగా ఇండియన్ స్టార్టప్లలో టెన్సెంట్, అలీబాబా వంటి చైనీస్ ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులపై ఎఫెక్ట్ చూపనుంది.
ఈ ఎఫ్డీఐ నిబంధనలు బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి టెక్ స్టార్టప్లను తీవ్రంగా దెబ్బతీయనున్నాయి. ఈ కంపెనీల్లో చైనీస్ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆన్లైన్ గ్రోసరీ రిటైలర్ బిగ్బాస్కెట్, డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం, రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ ఓలా కంపెనీల్లో చైనీస్ కంపెనీలు ఇప్పటికే కోట్లకొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ (ఎఫ్డీఐ) రూల్స్ ఈ కంపెనీల్లోకి తాజాగా పెట్టుబడులు పెట్టాలంటే చైనీస్ ఇన్వెస్టర్లకు ఆటంకంగా మారాయి. ఇండియన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలంటే చైనీస్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఇన్వెస్టర్లందరూ ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ‘కొత్త ఎఫ్డీఐ గైడ్లైన్స్ ప్రకారం, చైనీస్ కా పిటల్ ఇండియన్ కంపెనీల్లోకి రావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ రూల్స్ ఇష్టం లేని వారు ఇన్వెస్ట్మెంట్లకు దూరమవుతారు. ముఖ్యంగా ఫోన్పే వంటివి ఇబ్బంది పడుతాయి’ అని భారత్ పే కో ఫౌండర్, సీఈవో అశ్నీర్ గ్రోవర్ అన్నారు.
ఇండియా పేమెంట్ స్పేస్లో గ్లోబల్ కంపెనీలన్ని పోటీ పడుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పేలు మరింత వెచ్చించేందుకు చూస్తున్నాయి. బిగ్ బాస్కెట్కు ఇటీవల అలీబాబా నుంచి 50 మిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది. బిగ్బాస్కెట్లో అలీబాబా మరోసారి చేయబోయే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్పై ఎఫ్డీఐ పాలసీ దెబ్బకొట్టనుంది. గతేడాదే పేటీఎం 100 కోట్లడాలర్లను జపాన్ సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా యాంట్ ఫైనాన్షియల్ నుంచి సేకరించింది.