భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు విస్తరిస్తుంది. నేటి వరకు 20,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీటిలో 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,960 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 652 మంది ఇప్పటివరకు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 49 మంది మృత్యువాతపడ్డారు. ఇలా అంతటా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కొవిడ్-19 పరిస్థితి, లాక్డౌన్ సడలింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దేశంలోని 403 జిల్లాలకు వైరస్ విస్తరించిందని పేర్కొంటున్న అధికారులు లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ ట్రాన్సిమిషన్ తగ్గినట్లు వెల్లడించారు. ముంబయి 3 వేల కేసులతో టాప్లో కొనసాగుతుండగా తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-2,081, అహ్మదాబాద్-1,298, ఇండోర్-915, పూణె-660, జైపూర్లో 537 కేసులు నమోదయ్యాయి. 60 శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు ఈ ఐదు రాష్ర్టాల్లోనే నమోదయ్యాయి. ఇలా దేశంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 3 నుంచి లాక్డౌన్ ఎత్తివేత విషయంపై కూడా ఈ సమావేశంలో ప్రధాని సీఎంల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలపై కూడా ప్రధాని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా, హెల్త్ వర్కర్లపై దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్లపై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా పరిగణిస్తారు. కేవలం 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్యక్తికి మూడు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. నిందితులకు 50వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా కూడా విధించనున్నారు. ఒకవేళ చాలా తీవ్రమైన దాడి జరిగితే, దానికి మరో విధమైన శిక్షను అమలు చేయనున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితులకు 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేస్తారు. వారికి లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా వసూల్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు