ఏపీలో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కర్నూలులో కరోనా కేసుల సంఖ్య రెండు వందలు దాటిపోయింది. గుంటూరులో కరోనా సోకిన వారి సంఖ్య 177కు పెరిగింది, చిత్తూరులో 59 మందికి, కడపలో 51 మందికి కరోనా సోకింది. జనజీవనం స్తంభించిన తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. లాక్డౌన్ నేపథ్యంలో పండ్ల రైతులు నష్టపోకుండా, ప్రజలకు తక్కువ ఖర్చులో పండ్లు లభ్యమయ్యేలా ఏకకాలంలో చర్యలు తీసుకుంది.
రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పండ్లను పంపిణీ చేయనుంది. ఈ మేరకు విజయవాడలోని భవానీపురంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..రైతుల దగ్గరి నుంచే నేరుగా వినియోగదారులకు పండ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలకు వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లు అందజేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తాము పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి చెప్పారు.
కాగా, ఏపీలో ప్రస్తుతం జిల్లాల వారీగా కరనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. .
జిల్లా కరోనా కేసులు మృతులు
అనంతపురం 36 03
చిత్తూరు 59 00
తూ.గోదావరి 26 00
గుంటూరు 177 08
కడప 51 00
కృష్ణా 86 06
కర్నూలు 203 05
నెల్లూరు 67 02
ప్రకాశం 48 00
విశాఖ 21 00
ప.గోదావరి 39 00