కరోనా వైరస్.. ఎప్పుడు ఎవరిని ఎలా పట్టేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఇప్పటికే 1.80 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. మరియు 26 లక్షల మందికిపైగా కరోనా సోకి హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మందు లేని ఈ మహమ్మారినికి చెక్ పెట్టేందుకు ప్రపంచదేశాల ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. నిత్యవసర వస్తువులు మినహా.. మిగిలిన అన్ని సంస్థలు మూతపడ్డాయి. ఇక లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు.
అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గరవుతున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జరిగిన ఓ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ.. ఆ విషయానికి పక్కన పెట్టి తన పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంది. అయితే ఆమె నిర్లక్ష్యానికి ఫలతంగా ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడిని కలవడంతో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులనందరినీ శిఖర్పూర్లోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు.
అయితే ఆమె తన 38వ పెళ్లి రోజును క్వారంటైన్ సెంటర్లోనే వేడుకగా జరుపుకుంది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ ఆమె మాత్రం చాలా నిర్లక్ష్యంగా భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలో, వీడియోలు నిట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. అయితే ఆ తర్వాత జరిపిన పరీక్షల్లో ఆమె భర్తకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు వేడుకలో పాల్గొన్న మరో ముగ్గురిపై పోలీసులపై సైతం కేసు నమోదు చేశారు.