లాక్ డౌన్తో ఉపాధి లేక చిన్నా, పెద్ద ఉద్యోగులు, సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలకు ఆస్కారం లేకపోవడంతో చేతిలో డబ్బు కరువైంది. ఇలాంటి టైంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల ఇంటి అద్దెలు వసూలు చేయొద్దు. తర్వాత నెలల్లో వాయిదాల్లో వసూలు చేసుకోవాలి. ఇది ఓనర్లకు అప్పీల్ కాదు, గవర్నమెంట్ ఆదేశం” అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన అనంతరం హైదరాబాద్ సిటీలో ఊహించని పరిస్థితి తెరమీదకు వస్తోంది. నగరంలోని ఇంటి యజమానులు, సొసైటీ మెంబర్ల ఒత్తిళ్లు అక్కడక్కడా బయటపడ్డాయి.
గ్రేటర్లో రోజూ పదుల సంఖ్యలో ఓనర్లు, కిరాయిదారులకు సంబంధించిన ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ల వద్దకు వస్తున్నాయి. పుప్పాలగూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో 250 కుటుంబాలు ఉంటున్నాయి. ఒక్కో కుటుంబం ప్రతీ నెల రూ. 6వేల మెయింటెనెన్స్ చెల్లించాలి. కాగా, వచ్చే మూడు నెలల మొత్తాన్ని ఇప్పుడే చెల్లించాలని సొసైటీ మెంబర్లు ఒత్తిడి చేయగా.... ఆయా కుటుంబ సభ్యులు తమ వల్ల కాదని తెలిపారు దీంతో ఈ విషయంలో కమిటీ మెంబర్లు, ఫ్లాట్ యజమానులకు మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కంప్లయింట్ తీసుకున్న నార్సింగి పోలీసులు ప్రస్తుతానికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం.. రెంట్, మెయింటెనెన్స్ కట్టకపోయినా సేవలు నిలిపేయడానికి వీల్లేదు. కానీ అపార్ట్మెంట్ అసోసియేషన్లు, ఓనర్లు కరెంట్, వాటర్ సప్లయ్ నిలిపివేయడం, చెత్త క్లీన్ చేయకపోవడం, కారిడార్ లో బయటకు తిరగొద్దని ఆదేశించడం వంటివి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.
ఇదిలాఉండగా, కిరాయిల సమస్యతో కొందరు ఇంటి ఓనర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. హౌసింగ్ లోన్ తీసుకుని ప్రతి నెల రెంట్ల ద్వారా వచ్చే డబ్బును ఈఎంఐలుగా చెల్లించి, మిగిలిన వాటిని మెయింటెన్స్కు ఖర్చు చేస్తున్నవాళ్లు సిటీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వారికి టైమ్కు రెంట్ రాకున్నా, నిర్వహణ ఇబ్బందవుతోంది. దీంతో పోలీసుల వద్ద వారు తమ బాధను వెల్లబోసుకుంటున్నారు.