ఉత్తరకొరియా అధినేత, వివాదాస్పద నేత కిమ్ ఆరోగ్యంపై సస్పెన్స్ మరో మలుపు తిరిగింది. ఆయనకు తీవ్రంగా జబ్బు చేసిందని, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని, చనిపోయారని కూడా రకరకాలుగా వదంతులు వచ్చాయి. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడా..లేదా పరిస్థితి విషమంగా ఉందా అనేది ఇంకా స్పష్టత లేదు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి కిమ్ క్షేమమేనని, ఏమీ ఢోకా లేదని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా జనం మనసుల్లో సందేహాలు అలాగే ఉన్నాయి. ఇదే సమయంలో కరోనా సృష్టికర్త అయిన డ్రాగన్ కంట్రీ చిత్రంగా స్పందించింది. ప్రపంచంలో ఉత్తర కొరియాకు ఏకైక సన్నిహిత దేశం చైనా. ఈ నేపథ్యంలో చైనా అధికారులు, వైద్యుల బృందాలు ఉత్తర కొరియాను సందర్శించడం చర్చకు దారితీసింది.
ఉత్తర కొరియాలో వైద్య సేవలు అంతంత మాత్రమే. ఇదే సమయంలో కిమ్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కిమ్కు వైద్యం అందించేందుకు మిత్ర దేశమైన చైనా ఓ టీమ్ని అక్కడికి పంపిందని సమాచారం. చైనా పంపిన టీమ్ ఉత్తర కొరియాకు ఎందుకు వెళ్లారు? ఆ టీమ్లో వైద్య నిపుణులు ఎందుకున్నారని తెలియడం లేదు. చైనా బృందం వెళ్లిందనే విషయాన్ని తెలిపిన ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కూడా ఈ వివరాలను స్పష్టం చేయలేకపోయింది. చైనా యొక్క అంతర్జాతీయ సంబంధాల విభాగం సీనియర్ అధికారి ఉత్తర కొరియాకు వెళ్లారని తెలిపిన ఆ సంస్థ ఎందుకు వెళ్లారో మాత్రం వివరించలేదు.
అత్యంత నిగూఢంగా గడిపే దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. ముఖ్యంగా నాయకుల ఆరోగ్యంపై ఎప్పుడూ సమాచారం బయటపెట్టరు. దాంతో ఊహాగానాలకు తెరలేస్తుంది. ఇప్పుడు ఈ ప్రచారంలోకి చైనా వచ్చినప్పటికీ...మిలిట్రీ పాలనలో ఉండే ఆ దేశం కూడా నోరు విప్పడం లేదు. కిమ్ సజీవంగానే ఉన్నారని, త్వరలో బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఓ దక్షిణ కొరియా అదికారి చెప్పారు. కిమ్ ఆరోగ్యస్థితిపై, ఇన్నాళ్లూ బయటకు రాకపోవడంపై ఆయన కూడా ఏమీ చెప్పలేదు.