కరోనా సమయంలో ఇప్పుడు వైద్యులు, పోలీసులు, అధికారులు దేవుళ్లుగా మారారు. అందరి కంటే ఎక్కువగా కరోనాతో సావాసం చేస్తూనే దానితో పోరాడుతున్నారు వైద్యసిబ్బంది. వారి కష్టానికి, త్యాగానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారి తర్వాత చెప్పుకోవాల్సింది పోలీసులనే.. రేయనక, పగలనక డ్యూటీలు చేస్తూ.. ప్రజలను కట్టడి చేస్తున్నారు.

 

 

వృత్తి రీత్యా వారు కూడా కరోనాతో సావాసం చేస్తూనే పోరాడుతున్నారు. ఏపీలో ఇటీవల ఓ ఎస్సై లాక్ డౌన్‌ లో విధులు నిర్వర్తిస్తూ.. కరోనా బారిన పడ్డాడు. ప్రాణాలు వదిలాడు. లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి ఏపీ సర్కారు 50 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. వెంటనే ఆ సొమ్మును ఆయన కుటుంబానికి అందించింది.

 

 

చనిపోయిన మనిషిని తీసుకురాలేకపోయినా.. ఇలాంటి కష్టకాలంలో మీకు మేం అండగా ఉన్నామనే భరోసా నింపింది ఏపీ సర్కారు. అందుకే ఏపీ సీఎం జగన్ కు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు కుటుంబాన్ని సకాలంలో ఆదుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్‌ నుంచి 1185 మంది వచ్చారు ..వారందరిని క్వారంటైన్‌లో ఉంచామని డీజీపీ ఇదే సమయంలో వివరించారు.

 

 

దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందని డీజీపీ అంటున్నారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని డీజీపీ గౌతమ్ సవాంగ్ హితవు పలికారు. ఏదేమైనా కరోనా సమయంలో పోలీసులు చేస్తున్న సేవలను సమాజం గుర్తు పెట్టుకుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: